హైదరాబాద్ సహా తెలంగాణలో ఈరోజు, రేపు మండిపోనున్న ఎండలు

  • హైదరాబాద్ లో నిన్న 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
  • భద్రాద్రి జిల్లా గరిమెల్లపాడులో 44.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
  • పలు జిల్లాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. నిన్నటి కన్నా ఈరోజు, రేపు ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాటు వడగాలుల ముప్పు కూడా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. 

నిన్న తెలంగాణ వ్యాప్తంగా సూర్యుడు నిప్పులు చిమ్మాడు. తీవ్రమైన వేడిమితో ప్రజలు అల్లాడిపోయారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో, ప్రజలు రోడ్లపైకి రావడానికే భయపడ్డారు. రహదారులపై సంచారం తగ్గింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెల్లపాడులో 44.2 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని అనేక మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. 

ఈరోజు, రేపు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్న నేపథ్యంలో... ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని హెచ్చరించారు.

Hyderabad
Telangana
Temperature

More Telugu News